8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

సెప్టెంబర్‌ 17, 1948

సెప్టెంబర్‌ 17, 1948.
Nomula Prabhakar Goud చరిత్ర తెలియని వారికి ఈ తేదీ ప్రాధాన్యం పెద్దగా తెలియకపోవచ్చు, కానీ చరిత్ర తెలిసిన వారి మనసు భావోద్వేగంతో నిండిపోతుంది. ఆనాటి స్వాతంత్య్ర సమరం, పోరాట యోధులు, త్యాగధనులను తలచుకొని వారికి నివాళులర్పిస్తారు. అదే సమయంలో కొందరు ఈ తేదీ గురించి చెపితే ఉలిక్కిపడతారు. ఆత్మవంచన చేసుకుంటారు. ఈ తేదీకి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని, మొండిగా వాదించే ప్రయత్నం చేస్తారు. 68 ఏళ్ల క్రితం అంటే సరిగ్గా ఇదే రోజున భారతదేశం నడిబొడ్డున ఒక సర్జరీ జరిగింది. క్యాన్సర్‌ లాంటి కణితిగడ్డ తొలగిపోయింది.. 1948 సెప్టెంబర్‌ 17 నాడు విజాతీయ, ఫ్యూడల్‌ భావాలు గల హైదరాబాద్‌ సంస్థానం కాలగర్భంలో కలిసింది. ఇక్కడి ప్రజలు స్వేచ్ఛాస్వాతంత్య్రాలు పొందారు. ఇది వాస్తవం. తెలంగాణ విమోచన ఉత్సవాలు ఎందుకు జరపరు? భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో 1947 ఆగస్టు 15కు ఎంత ప్రాధాన్యం ఉందో, తెలంగాణ విమోచనం జరిగిన 1948 సెప్టెంబర్‌ 17కూ అంతే ప్రాముఖ్యం ఉంది. ఈ రెండూ స్వాతంత్య్ర దినోత్స వాలే. దురదష్టవశాత్తు తెలంగాణ ప్రజలు ఏడు దశాబ్దాలుగా తెలంగాణ స్వాతంత్య్రదిన ఉత్సవాలకు నోచుకోలేక పోతున్నారు. 1956 నవంబర్‌ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. నిజాం నుండి విమోచన లభించిన హైదరాబాద్‌ సంస్థానంలోని తెలంగాణను ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోనూ, మరాఠ్వాడాను బొంబే స్టేట్‌ (మహారాష్ట్ర) లోనూ, కర్ణాటక ప్రాంతాన్ని మైసూర్‌ స్టేట్‌లోనూ విలీనం చేశారు. ప్రతి ఏటా 17 సెప్టెంబర్‌ నాడు మహారాష్ట్ర, కర్ణాటకల్లోని పాత హైదరాబాద్‌ భూభాగాల్లో విమోచన వేడుకలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఘనంగా నిర్వహిస్తున్నాయి. కానీ పాత హైదరాబాద్‌ సంస్థానంలోని ప్రధాన భాగమైన తెలంగాణ మాత్రం ఈ అదష్టానికి దూరంగా ఉండిపోయింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ఏనాడూ హైదరాబాద్‌ విమోచన వేడుకలను నిర్వహించిన పాపాన పోలేదు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే మార్గంలో కొనసాగుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో కె.చంద్రశేఖరరావు విమోచన ఉత్సవాలను ఎందుకు నిర్వహించడం లేదంటూ నాటి ఆంధ్రప్రదేశ్‌ పాలకులను తప్పు పట్టారు. తెలంగాణ వచ్చాక అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ తెలంగాణ ఏర్పడి, స్వయానా కె.చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి అయ్యారు, కానీ ఇచ్చిన హామీని నిలుపుకోవడానికి జంకుతున్నారు. అందుకు కారణం సుస్పష్టం. ఆనాటి రజాకార్ల పార్టీ మజ్లిస్‌తో కె.చంద్రశేఖర రావు పార్టీ టిఆర్‌ఎస్‌ స్నేహ బంధం మొదలు పెట్టింది. హైదరాబాద్‌ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తే వారు నొచ్చుకుంటారని టిఆర్‌ఎస్‌ భయం. అసలు తెలంగాణ విమోచన వేడుకలకు మతం రంగు పులమాల్సిన అవసరం ఏముంది? ఈ వేడుకలు ముస్లింలకు వ్యతిరేకం అని ఎవరన్నారు? హైదరాబాద్‌ విమోచన ఉద్యమం ముస్లింలకు వ్యతిరేకం అనే అపోహలను కల్పించిన పాపం కేవలం ఓట్ల రాజకీయాలకు పాల్పడే కొందరు రాజకీయ నాయకులది మాత్రమే. ముస్లింలు కూడా నిజాం అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన విషయాన్ని వారు మరచిపోతున్నారు. నిజాం, రజాకార్ల దాష్టీకాలు, దమన నీతిని తన ‘రయ్యత్‌’, ‘ఇమ్రోజ్‌’ పత్రికల ద్వారా ఎండగట్టిన ముస్లిం పాత్రికేయుడు షోయబుల్లా ఖాన్‌. అందుకు అతను అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. కమ్యూనిస్టు నాయకుడు మగ్దుం మొహియుద్దీన్‌, దొరల అరాచకాలపై ధిక్కార స్వరం వినిపించిన షేక్‌ బందగీ తదితరులు ముస్లింలు కాదా? హైదరాబాద్‌ విమోచన వేడుకలను అధికారి కంగా నిర్వహించకుండా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మొండి పట్టుదలకు పోతున్నట్లు? హైదరా బాద్‌ స్వాతంత్య్రాన్ని, ఆనాటి పోరాట యోధులను, త్యాగధనులను తలచుకునే అపూర్వ ఘడియల గురించి భావి తరాలు తెలుసుకోకుండా అడ్డంకులను ఎందుకు కల్పిస్తున్నట్లు? ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం తమ సంకుచిత విధానాలు, మొండివైఖరిని పక్కనపెట్టాలి. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా, రాజకీయాలకతీతంగా ఘనంగా నిర్వహించాలి. Nomula Prabhakar Goud

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SC ,ST రిజర్వేషన్లు

SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...